హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్య స్వరూపాన్ని సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నది. మన ఊరు- మన బడి పథకంలో భాగంగా మొదటి విడతలో 3 వేల పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించనున్నది. అందుకు రూ.300 కోట్లు వెచ్చించనున్నది. 3 వేల స్కూళ్లకుగానూ ఒక్కో బడిలో రెండు స్మార్ట్ క్లాస్రూంల చొప్పున మొత్తం 6 వేల క్లాస్రూంలను స్మార్ట్గా మార్చనున్నది. ఒక్కో స్కూల్కు రూ. 10 లక్షల చొప్పున ఖర్చుచేయనున్నది.
రోజువారీ తరగతి బోధనను కొత్త పుంతలు తొక్కించడంలో భాగంగానే ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నది. కార్పొరేట్ను తలదన్నేలా సర్కారు స్కూళ్లను ఆధునీకరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్మార్ట్క్లాస్రూంల ఏర్పాటు అంశాన్ని సమగ్రశిక్ష అభియాన్ అధికారులకు అప్పగించగా, వారు పర్యవేక్షిస్తున్నారు.
పాఠశాలకు రెండు తరగతి గదులను డిజిటల్ క్లాసురూంలుగా మారుస్తారు. వీటిల్లో ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, డిజిటల్ తెర, లేదా ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు ఉంటాయి. మొత్తం 25 వరకు పరికరాలు, ఉపకరణాలుంటాయి.
6 నుంచి 10వ తరగతి వరకు గల డిజిటలైజ్ (రికార్డు) చేసిన పాఠ్యాంశాలను కంప్యూటర్ హార్డ్ డిస్క్లలో నిక్షిప్తం చేస్తారు. ఇంటర్నెట్ సహాయంతోనూ పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తారు.
టీచర్లు లైవ్గా పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఇంట్లో ఉండి కూడా పాఠాలు వినొచ్చు.
విద్యార్థులు తమకు కావాల్సిన పాఠాన్ని ఎన్ని సార్లయినా టీచర్ సహాయంతో లేదా సొంతంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు.