తొర్రూరు, జూలై 13 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్ర రూపం దాల్చింది. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి సొంత ఊర్లోనే కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఝాన్సీ రెడ్డి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఝాన్సీ రెడ్డి పై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు.
తొర్రూరు కాంగ్రెస్ మండల పార్టీ ఇంచార్జ్ ఎర్రబెల్లి రాఘవరావు సమావేశానికి హాజరవ్వగా యశస్విని రెడ్డి, తిరుపతి రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే మీటింగులు పెడతారంటూ నిలదీశారు. అక్కడితో ఆగకుండా టెంట్లు కూల్చివేసి, కుర్చీలు ధ్వంసం చేశారు.
ఝాన్సీ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకలాపాలు నిలకడగా లేవని, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం న్యాయమా? అంటూ కార్యకర్తలు ప్రశ్నించారు. అదేవిధంగా తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అంటూ పలువురు కార్యకర్తలు హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వర్గపోరుతో తొర్రూరు కాంగ్రెస్లో అత్తా–కోడళ్ల రాజకీయ సంఘర్షణ బహిర్గతమైంది. యశస్వి రెడ్డి, ఝాన్సీ రెడ్డి వర్గాలు పరస్పరం పోటీపడుతుండటంతో పార్టీకి తీవ్ర విఘాతం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మండల పార్టీ ఇంచార్జ్ ఎర్రబెల్లి రాఘవరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, వాసిరెడ్డి, మహేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, రామచంద్రు, ఎద్దు మహేష్, ధర్మారపు ఎంకుమల్లు, ధర్మారపు యాకయ్య, మీసాల సాయిలు, ప్రవీణ్, శ్రీనివాస్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.