వరంగల్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీ పర్యటన ఏర్పాట్లు ఆ పార్టీలోని వర్గపోరును బహిర్గతం చేస్తున్నాయి. వరంగల్లో వచ్చే నెల 6న రాహుల్గాంధీ బహిరంగసభ ఏర్పాట్ల కోసం వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలోనే వరంగల్-హనుమకొండ జిల్లాల డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అనుచరులు కొట్టుకున్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో రాహుల్ సభకు పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటి ముఖ్యనేతలు ఈ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం గ్రౌండ్కు వచ్చారు. అదే సమయంలోనే అప్పటికే అక్కడ ఉన్న నాయిని రాజేందర్రెడ్డి, జంగా రాఘవరెడ్డి అనుచరులు కొట్లాటకు దిగారు.
జంగా రాఘవరెడ్డిపై పలువురు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకుంటూ కొట్టుకున్నారు. గత ఎన్నికల్లో పాలకుర్తిలో పోటీ చేసి ఓడిపోయిన జంగా రాఘవరెడ్డి.. ఇటీవల వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉంటున్న నాయిని రాజేందర్రెడ్డి దీనిపై ఆగ్రహంతో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో రెండు వర్గాల నేతల మధ్య లొల్లి పతాక స్థాయికి చేరింది. బలం నిరూపించుకునేందుకు జై జంగా… జై నాయిని అంటూ ఇరువర్గాల వర్గీయులు నినాదాలు చేస్తూ రాష్ట్ర నేతలను అడ్డుకున్నంత పనిచేశారు. బల నిరూపణ కోసం గొడవకు దిగారు.