అమరావతి : గురుకుల పాఠశాలల విద్యార్థులకు పెంచిన డైట్చార్జీలను కస్తూర్భా పాఠశాలలకు ( Kasturbha schools) కూడా వర్తింప చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినిలతో మాట్లాడారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో మధ్యాహ్నభోజనం ధరలు పెంచుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు. గురుకులాల్లో మార్పుల్లో కస్తుర్భా పాఠశాలలు లేకపోవడం బాధకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్భా పాఠశాలలున్నాయని, సర్వశిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నారని, వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
కస్తూర్భా అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాలను కళాశాలగా అప్గ్రేడ్కు కృషి చేశానని, త్వరలో కళాశాల ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతీ అంశంపై బీఆర్ఎస్ ఉద్యమించి హక్కులను సాధించుకుంటుందని పేర్కొన్నారు.