హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టే ప్రతి పథకానికీ బహుముఖ ప్రయోజనాలుంటాయని మరోసారి నిరూపితమైంది. మిషన్ భగీరథ పథకం ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చి ప్రజల తాగు నీటి కష్టాలు తీర్చటమే పైకి కనిపిస్తున్నా, దాని ద్వారా అసాధారణ మార్పులు వస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛమైన నీరు తాగుతుండటంతో కలుషిత నీటి ద్వారా వ్యాపించే రోగాలన్నీ తగ్గిపోయాయి. డయేరియా కట్టడిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తాజాగా ఫ్యాక్లీ సంస్థ విశ్లేషించింది. 2017తో పోల్చితే ఆరేండ్లలో ఏకంగా 93 శాతం కేసులు తగ్గిపోయాయి. 2021లో దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ కన్నా కనీసం మూడురెట్లు అధికంగా డయేరియా కేసులు వెలుగు చూశాయి. తద్వారా దేశంలో డయేరియాను కట్టడి చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్’ విడుదల చేసిన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్’ ఆధారంగా ఫ్యాక్లీ ఈ నివేదిక తయారు చేసింది. 2016లో తెలంగాణలో 10.7 లక్షల డయేరియా కేసులు నమోదవ్వగా.. 2021 నాటికి 70 వేలకు పడిపోయినట్టు వెల్లడించింది.
నివేదికలోని కీలకాంశాలు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్తో పోల్చితే తెలంగాణలో డయేరియా కేసుల్లో స్థిరంగా తగ్గుదల కనిపించింది. 2021లో అన్ని రాష్ర్టాల్లో తెలంగాణ కన్నా గరిష్ఠంగా 30 రెట్ల కేసులు నమోదయ్యాయి.
పశ్చిమబెంగాల్లో 20.6 లక్షల మంది డయేరియా బారిన పడ్డారు. దేశంలోనే అత్యధికం. 2021లో ఏపీలో 2 లక్షలు, యూపీలో 2.2 లక్షలు, మధ్యప్రదేశ్ 2.3 లక్షలు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 3.3 లక్షలు, ఒడిశాలో 3.8 లక్షల కేసులు నమోదయ్యాయి.