Diamond | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కర్నూల్ జిల్లాలో ఓ రైతు పంట పండింది. తొలకరి వర్షానికి పొలం దున్నుతుండగా, వజ్రం దొరికింది. దానిని విలువ రూ.2 కోట్లు ఉంటుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మద్దెకర మండలం బసినేపల్లిలో ఓ రైతు తొలకరి వర్షానికి పొలాన్ని దున్నుతుండగా, ఒక్కసారిగా రాయిలాంటి వస్తువు కనబడింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని పరిశీలించగా, వజ్రం ముద్దలా కనిపించింది.
దాన్ని వ్యాపారి వద్దకు తీసుకెళ్లగా, పరిశీలించిన వ్యాపారి విలువైన వజ్రమని, దాని విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలిపాడు. దీంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. కాగా, అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో విలువైన వజ్రాలున్నాయని చరిత్రకారులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట కోసం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు వచ్చి అన్వేషణ కొనసాగిస్తుంటారు.