త్రివర్ణ వెలుగులు విరజిమ్ముతుండగా, చుట్టూ నోరూరించే వంటకాలు ఘుమ ఘుమలాడుతుండగా, సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తుండగా చార్మినార్ వద్ద ఆదివారం సాయంత్రం వేలమంది సందర్శకులు సందడి చేశారు. సండేను ఫన్ డేగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా అందుబాటులోకి తెచ్చిన ‘ఏక్ శామ్.. చార్మినార్కే నామ్’లో హుషారుగా గడిపారు. చార్మినార్కు నాలుగు దిక్కుల భారీ స్క్రీన్లతో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోలీస్ బ్యాండ్ అలరించింది. కుటుంబసమేతంగా సండే ఫన్డేలో పాల్గొన్నవారికి జీహెచ్ఎంసీ సిబ్బంది ఉచితంగా మొక్కలు అందజేశారు.