పాల్వంచ, మార్చి 29 : పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు బండి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నెలనెలా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిందని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ప్రతి నెలా వేతనాలు వచ్చేలా చూడాలని కోరారు. ఏప్రిల్ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోతే సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దవాఖాన అధికారులకు నోటీసు అందజేశారు.