హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ప్రత్యేక సమావేశాల్లో మహిళా, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..
ఈ రెండు బిల్లులను పార్లమెంట్లో ఆమోదించేవరకూ పోరాడతామన్నారు. ఈ బిల్లుల విషయం సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.