హైదరాబాద్, మార్చి29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విమర్శించారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ కమిటీల సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీ జంతర్మంతర్ వద్ద బుధవారం చేపట్టిన బీసీ జనగణన దీక్షను ఎంపీ ప్రారంభించారు. దీక్షనుద్దేశించిన ఆయన మాట్లాడుతూ జాతీయ జనగణనలో భాగంగా బీసీ కులగణన చేపట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీనికోసం ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తుచేశారు. కులగణన కోసం ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ స్పందించకపోడమే కేంద్రం బీసీ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బీసీలకు మేలు చేయని ప్రధాని మోదీ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని అన్నారు. దీక్షకు కాంగ్రెస్, టీడీపీ, తదితర పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. దీక్షలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు కేశన శంకర్రావు, కులచర్ల శ్రీనివాసులు కూర్చున్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్గౌడ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్కుర్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజరి తదితరులు పాల్గొన్నారు.