కడెం, మార్చి 5 : సదర్మాట్ చివరి ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వాలని రైతులు మంగళవారం నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా అర కిలోమీటరు మేర వాహనాలు నిలువడంతో కడెం ఎస్ఐ రాజు ఘటనాస్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు రావాలని, నీళ్లు వదులుతామని హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, లక్ష్మీసాగర్, పెద్దూర్ గ్రామాలకు చెందిన రైతులు పట్టు పట్టారు.
తహసీల్దార్ సుజాతారెడ్డి వచ్చి చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చినా ఆందోళన విరమించలేదు. తహసీల్దార్ సమాచారంతో నీటి పారుదల శాఖ ఈఈ విఠల్, ఏఈ రవికుమార్లు ఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏఈ రవికుమార్ను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇతర గ్రామాల రైతుల వద్ద ఎకరాకు రూ. 300 చొప్పున వసూలు చేసి నీటిని మళ్లీస్తున్నారని, 20 రోజులుగా తమ పంటలు ఎండుతున్నా నీరివ్వడం లేదని మండిపడ్డారు. చివరికి ఈఈ విఠల్ ఆయకట్టు చివరి వరకు ప్రతి ఎకరాకు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.