హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ రైతు, గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, అటవీ సంరక్షణ నియమాలు -2022 ఉపసంహరించుకోవాలని, రైతు రుణ విముక్తి చట్టం తేవాలనే డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా చలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా శనివారం హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి రైతు, గిరిజన సంఘాల నాయకులు యత్నించారు. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి రాజ్భవన్ వైపు బయలుదేరగా పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొన్నది.
దీంతో నాయకులు ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ వద్దే బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ సందర్భంగా రైతు, గిరిజన సంఘాల నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కారు రైతులను అన్నింట్లోనూ వంచిస్తున్నదని ఆరోపించారు. పంటలకు మద్దతు ధరకు గ్యారెంటీ చట్టం చేయాలని, రైతు రుణ విముక్తి చట్టం చేయాలని, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలనే ఉద్యమంలో సుమారు 80 వేలమందిపై అక్రమ కేసులు పెట్టారని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని, లఖింపూర్కకేరీలో ఐదుగురి మృతికి కారకుడైన అప్పటి కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సంయుక్త కిసాన్ మోర్చా, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు పశ్య పద్మ, టీ సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య, ఉజ్జిని యాదగిరిరావు, రాయల చంద్రశేఖర్ప్రసాద్, మట్టయ్య, రమావత్ అంజయ్య నాయక్, శ్రీరామ్, బాల మల్లేశ్, పుస్తెల సృజన, సంధ్య, ఇందిరా భిక్షపతి, భాగం హేమంతరావు, సుదర్శన్రావు, కంజర భూమయ్య, గోవిందరావు, కే సూర్యనారాయణ, కే రాజయ్య, బీ రామకృష్ణారెడ్డి, టీ రాంరెడ్డి, ప్రభులింగం, కంబాల శ్రీనివాస్, దొడ్డ వెంకటయ్య, విష్ణువర్ధన్రెడ్డి, రామచంద్రం, బంటు వెంకటేశ్వర్లు, వెంకట్ రెడ్డి, ఉప్పుల కొమరయ్య తదితరులు ఉన్నారు.
మోదీ.. మరోసారి మోసం : కూనంనేని
ప్రధాని మోదీ మరోసారి దేశ రైతాంగాన్ని మోసం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. చలో రాజ్భవన్ సందర్భంగా నాయకుల, రైతులు అరెస్టులను ఖండించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించి స్వామినాథన్ సిఫార్సులను అమలుచేస్తున్నానని మోదీ అబద్ధాలాడుతున్నారని చెప్పారు.