హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దేవాదాయశాఖ ఏర్పాటుచేసిన ధర్మవాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ధర్మవాణిలో పలువురు అర్చక ఉద్యోగులు తమ సమస్యలను ఆ శాఖ డైరెక్టర్ ఎం హన్మంతరావు దృష్టికి తీసుకొచ్చారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించిన డైరెక్టర్, మరికొన్ని సమస్యలపై క్షేత్రస్థాయిలో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పనిచేస్తూ మరణించిన అర్చకుడి కూతురు భార్గవికి కారుణ్యనియామక ఉత్తర్వులు అందజేశారు. కొమురవెల్లి దేవస్థానంలో పనిచేస్తున్న హోమ్గార్డ్స్కు పెంచిన డ్యూటీ, పరేడ్, వాషింగ్ అలవెన్స్ల మంజూరు, గత మార్చి నుంచి పెండింగ్ ఉన్న వేతన అలవెన్స్ల పెంపు విషయాన్ని హోమ్గార్డులు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇన్చార్జి ఈవోగా ఉన్న కృష్ణప్రసాద్ను అక్కడికక్కడే ఉత్తర్వులు సిద్ధం చేసి పెంచిన అలవెన్స్లు ఇవ్వాలని హన్మంతరావు సూచించారు.