హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి (Dharmapuri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu) ముస్తాబయింది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అయిన మార్చి 3 నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం వరాహతీర్థం, పుట్ట బంగారం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. శనివారం గోధూళి సుముహూర్తాన లక్ష్మీనరసింహస్వామివారి (Sri Lakshmi Narasimha swamy) కల్యాణం నిర్వహిస్తారు. ఇప్పటికే ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ధర్మపురి క్షేత్రంలో శ్రీబ్రహ్మదేవుడు, విష్ణు స్వరూపుడు అయిన శ్రీలక్ష్మీనారసింహస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరిన ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో భారత దేశంలో ఎక్కడాలేని విధంగా శ్రీయమధర్మరాజు ఆలయం ఉంది. ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదు అనే నానుడి కూడా ఉంది.