MP Arvind | జగిత్యాల టౌన్, ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలోనే బీజేపీకిలోకి వస్తారని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డిది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ అని, ఆయన మనసులో హిందుత్వం బలంగా ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో నేడు ఉన్నారని చెప్పారు. బీజేపీతో కొట్లాడుతామని చెప్పి బీజేపీలోకే వస్తున్నారని విమర్శించారు. కానీ, బీజేపీతో అంతో ఇంతో కొట్లాడింది కేసీఆర్ ఒక్కరే అని అర్వింద్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్క డా ఇబ్బందులు రాకుండా కరెంటు ఇచ్చానని గొప్పగా చెప్పుకొని ఓట్లడిగే హక్కు ఒక్క కేసీఆర్కు మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు.
అసలు కాంగ్రెస్కు ఒక ఎజెండా అం టూ లేదని, ఆ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు ఏమాత్రం లేదని విమర్శించారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించి నాశనం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేస్తం, ట్రిపుల్ తలాక్ తెస్తాం అంటున్నారని దుయ్యబట్టారు. సీఏఏను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థంకావడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో సెక్యులర్ పదం ఎందుకు పెట్టారో చెప్పాలని, ఈ దేశాన్ని 70 ఏండ్లు పాలించి చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రైవేటు ఇష్యూ అని, దానిపై ఫోకస్ పెట్టడమేంటి అని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీగా జగిత్యాల జీవన్రెడ్డి పోటీ చేస్తున్నారని ఇక్కడి ప్రజలు అనుకోవడం లేదని, ఆర్మూరు జీవన్రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.