హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సచివాలయంలో తొలిసారి సమావేశమైంది. కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్కుమార్, రేమండ్పీటర్, మధుసూదన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్మిట్టల్, సీఎంఆర్వో డైరెక్టర్ లచ్చిరెడ్డి హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. అనంతరం కోదండరెడ్డి, లచ్చిరెడ్డి, సునీల్కుమార్ మీడియాతో మాట్లాడారు. ధరణి పునర్నిర్మాణంపై ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేనని చెప్పారు.
కమిటీ విధివిధానాలు, ఏయే అంశాలపై దృష్టిసారించాలో చర్చించినట్టు తెలిపారు. పోర్టల్లో సుమారు 40-50 రకాల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిపై రైతులకు భరోసా కల్పించడంతోపాటు, ప్రభుత్వానికి వేగంగా సలహాలు ఇవ్వడంపై దృష్టిసారించినట్టు వివరించారు. కమిటీ ఇకపై సీసీఎల్ఏ కార్యాలయం నుంచి పనిచేస్తుందని, ఇందుకోసం తమకు ప్రత్యేక గది, సిబ్బంది కేటాయింపు వంటివి చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
నిపుణులు, ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను అక్కడ స్వీకరిస్తామని పేర్కొన్నారు. భూ సంబంధ సమస్యలపై తాము ఎలాంటి దరఖాస్తులు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత విధానంలోనే ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తుది నివేదిక ఇవ్వడానికి ఎక్కువ కాలం పడుతుందని పేర్కొన్నారు. ఆలోగా ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు ఇస్తామని చెప్పారు. ఈ నెల 17వ తేదీన కమిటీ రెండోసారి సమావేశమవుతుందని, అప్పుడు మరిన్ని అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.