TS DGP | ఎన్నికల కౌటింగ్కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగ్గా.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో సీపీలు, ఎస్పీలతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. కౌంటింగ్ సెంటర్ల వెలుపల, బయట గట్టి నిఘా వేయాలని సూచించారు.
కౌంటింగ్ చివరి రౌండ్లలో ఉత్కంఠగా సాగే అవకాశం ఉంటుందని.. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడకుండా చూడాలని.. పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అదనపు బలగాలను అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికలను ఇప్పటి వరకు ప్రశాంతంగా నిర్వహించామని.. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.