హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ శాఖ మోహరించి సహాయకచర్యలు చేపట్టింది. గురువారం ఒక్కరోజే లోతట్టు ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురుచూసిన 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. సహాయ పునరావాస కార్యక్రమాలపై సలహాలు, సూచనలు, సహాయాన్ని అందించేందుకు డీజీపీ కార్యాలయంలో ‘ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితులు, సహాయ కార్యక్రమాలను డీజీపీ సహా అదనపు డీజీలు శివధర్రెడ్డి, సంజయ్ కుమార్జైన్, విజయ్ కుమార్తోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి శాటిలైట్ ద్వారా రోడ్ల పరిస్థితిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
అంజనీకుమార్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 3 వేల మందిని పునరావాస కేంద్రంకు తరలించినట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి సహాయక కార్యక్రమాల్లో భాంగా ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పోలీసులు పనిచేసినట్టు తెలిపారు. సెల్ఫీలు తీసుకొనేందుకు వచ్చి ప్రమాదాలకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, జలపాతాలు, మత్తడి పోస్తున్న చెరువులు, పారుతున్న కాలువల వద్దకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాల చుట్టుపక్కలకు వెళ్లొద్దని తెలిపారు. 24 గంటల పాటు డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించారు.