హైదరాబాద్: తెలంగాణ 6వ డీజీపీగా బీ. శివధర్ రెడ్డి బాధ్యతలు (DGP Shivadhar Reddy) స్వీకరించారు. లక్డీకపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. బేసిక్ పోలీసింగ్ సహాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు. పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని నక్సల్స్ నేత ఇటీవల లేఖ రాశారని, జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులను కోరుతున్నామని చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్కు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమాజాభివృద్ధిలో భాగం కావాలని మావోయిస్టులను కోరారు. పీఎస్ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీసు శాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వార్తల ప్రచారం, వ్యక్తిత్వ హననం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.