DGP Shivadhar Reddy | కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్కు డీజీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ను పూర్తిస్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని తెలిపారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణిచివేస్తామని స్పష్టం చేశారు.
భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటుందని డీజీపీ తెలిపారు. GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేస్తామని వెల్లడించారు. అలాగే అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
రియాజ్ ఎన్కౌంటర్పైనా డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్.. ఏఆర్ పోలీసుల గన్ను లాక్కున్నాడని తెలిపారు. ఆ గన్తో పోలీసులపై కాల్పులు జరపబోయాడని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు.