హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల సహాయంతో 18,234 కేసులను పోలీసులు సులువుగా ఛేదించారని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్సీఆర్బీ) తెలిపింది. ఒక్క 2022లోనే రాష్ట్రవ్యాప్తంగా 1,74,205 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 10,25,849 సీసీ కెమెరాలు ఉన్నాయని పేర్కొన్నది. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో సైబర్ నేరాలు 48.47%, ఆర్థిక నేరాలు 41.37%, వివిధ రకాల మోసాలు 43.30% పెరిగాయని వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వా త తొలిసారిగా ‘క్రైమ్ ఇన్ తెలంగాణ-2022’ పేరిట సీఐడీ ఏడీజీ మహేశ్భగవత్ రూపొందించిన పుస్తకాన్ని డీజీపీ రవిగుప్తా మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీజీప్తీ మా ట్లాడుతూ.. ఈ పుస్తకం అందించిన విలువైన సమాచారం నేరాలను అదుపు చేసే వ్యూహాలను, చట్టాలను రూపొందించడంలో కీలకంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు నేరపరిశోధనలో సైంటిఫిక్ టూల్స్, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ టెక్నాలజీని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్సీఆర్బీ క్రైమ్ ఇన్ ఇండియా-2022 నివేదిక ప్రకారం.. గుర్తించదగిన నేరాలు అతి తక్కువగా నమోదైన మెట్రోపాలిటిన్ నగరాల్లో తెలంగాణకు 3వ స్థానం రావడం సంతోషకరమని చెప్పారు. పట్టణ జనాభాలో కాగ్నిజబుల్ నేరాలు అతి తక్కువగా నమోదైన నగరాల్లో కోల్కతా, పుణె, హైదరాబాద్ ఉన్నాయని వివరించారు. మహేశ్భగవత్ పర్యవేక్షణలో ఎస్సీఆర్బీ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు చెన్నయ్య, సర్దార్సింగ్, ఇన్స్పెక్టర్లు నవీన్బాబు, శేఖర్రెడ్డి ఈ పుస్తకం రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారని అభినందించారు. కార్యక్రమంలో ఏడీజీలు శిఖాగోయెల్, అభిలాష బిస్త్, సౌమ్యామిశ్రా, సంజయ్జైన్ పాల్గొన్నారు.