హైదరాబాద్ : రాష్ట్రానికి డీజీపీ మహేందర్రెడ్డి అందించిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. మహేందర్రెడ్డి రేపు (శనివారం ) పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మంత్రి శుక్రవారం హైదరాబాద్ లకిడికాపూల్లోని తన కార్యాలయంలో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, రాష్ట్ర డీజీపీగా, దాదాపు 34 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు.
డీజీపీగా తెలంగాణ పోలీసు శాఖ ను అగ్రభాగాన నిలిపారని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీ లు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ పాల్గొన్నారు.