హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తన 36 ఏండ్ల సర్వీసు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తూ సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్న ఆయన పోలీసు శాఖలో అందించిన సేవలను వివరించారు. తారతమ్యాలు లేకుండా అందరికీ సమన్యాయం అందించేందుకు కృషి చేశానని, శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేశానని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో మావోయిస్టు సమస్య అధికమవుతుందని అందరూ అన్నారని, నేడు నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, సంస్కరణల ద్వారా తెలంగాణ పోలీస్ను దేశంలోనే మేటిగా తయారు చేశామని అన్నారు. తొలి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆయన సూచనలతో ఇతర దేశాల్లోని పోలీస్ వ్యవస్థపై అధ్యయనం చేసి వచ్చామని చెప్పారు. అత్యాధునిక విధానాలను ఇక్కడ అమలు చేయడం ద్వారా నేరం చేసిన వారు తప్పకుండా పట్టుబడతామనే భావన కలిగేలా చేశామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ చొరవతో పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని, ఇవ్వాళ సామాన్యులు ధైర్యంగా పోలీస్స్టేషన్కు వెళ్లే వాతావరణం కల్పించినట్టు వివరించారు. ఓ వైపు ప్రజలకు చక్కటి శాంతిభద్రతలు అందిస్తూనే పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకొన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన 8 ఏండ్లలో చెప్పుకోదగ్గ శాంతిభద్రతల సమస్య ఏర్పడలేదని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు.