హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. తాను ఇంట్లో జారిపడిన కారణంగా ఎడమభుజం పైన ఎముకలో మూడుచోట్ల ఫ్రాక్చర్లు అయినట్టు ఎక్స్-రే, సీటీసాన్, ఎంఆర్ఐ రిపోర్టుల్లో తేలిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భుజం కదలకుండా కట్టు కట్టిన వైద్యులు.. పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని సూచించడంతో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు సెలవులో వెళ్లినట్టు వివరించారు. వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని, రోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులు వాడుతున్నట్టు తెలిపారు. రేవంత్రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు, బాధ్యతారహిత ప్రచారం చేయడం పట్ల డీజీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న రేవంత్రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఉన్నతస్థాయిలో, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఆరోపణలు చేయడం ఆక్షేపణీయమని, ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. తప్పుడు ఆరోపణలు పోలీస్శాఖ ైస్థెర్యాన్ని దెబ్బతీస్తాయని, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న సీనియర్ అల్ ఇండియా సర్వీసుల అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయమనం పాటించాలని సూచించారు.