హైదరాబాద్ : రాష్ర్టంలో బోనాలు, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ రెండు పండుగల నిర్వహణపై డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి.. పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, పశు సంవర్ధక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో.. ఈ పండుగల నిర్వహణ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో గోల్కొండ బోనాలు, బక్రీద్ పండుగ, ఉజ్జయిని మహంకాళి బోనాలు, వచ్చే నెలలో పాత బస్తీలో బోనాలు పండుగ జరగనుంది. బక్రీద్, బోనాలు రెండు ఒకేసారి వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా పశువులను రవాణా చేసే వాహనదారులు సరైన అనుమతి పత్రాలను కలిగి ఉంటేనే అనుమతి ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు. ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసు, పశుసంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్ట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలతో కూడిన, రెచ్చగొట్టే పోస్టింగ్లు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని డీజీపీ పోలీసు అధికారులను ఆదేశించారు.