మేడ్చల్ రూరల్, మే 27: అత్యవసరమైతేనే, సరైన కారణాలు చూపితేనే ఈ పాస్లను జారీచేస్తామని, దరఖాస్తు చేసుకున్న వారందరికీ పాస్లు ఇవ్వలేమని డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన చెక్పోస్టును గురువారం ఆయన తనిఖీచేశారు. అంతకుముందే సీపీ సజ్జనార్, డీసీపీ పద్మజా కండ్లకోయకు వచ్చారు. డీజీపీ రాగానే లాక్డౌన్ అమలుతీరును వివరించారు. సర్కిల్లో ఏర్పాటుచేసిన చెక్పోస్టులు, లాక్డౌన్ అమలుతీరును సీఐ ప్రవీణ్రెడ్డిని డీజీపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ పాస్లు ఇస్తే రోడ్ల మీద రద్దీ పెరుగుతుందని అన్నారు. చెప్పే కారణాన్ని విశ్లేషించి, అత్యవసరమని గుర్తిస్తేనే పాస్ జారీచేస్తామని తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న వారందరికీ పాస్ వస్తుందని ప్రజలు భావించొద్దని సూచించారు. ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారు.. ఏ కారణంగా వెళ్తున్నారో ఈ పాస్లో వివరాలు ఉంటాయని తెలిపారు. దరఖాస్తుల్లో పేర్కొన్నట్టు కాకుండా వేరే ప్రదేశాల్లో సంచరించినా, పాస్లను దుర్వినియోగం చేసినట్టు గుర్తించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా చైన్ బ్రేక్ కావాలంటే అధిక జనసాంద్రత ఉన్న రాజధాని హైదరాబాద్ నుంచే ప్రారంభం కావాలని అన్నారు.
వైద్యంతోపాటు అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారి రాకపోకలను అడ్డుకోవడం లేదని తెలిపారు. వైద్యం కోసం, వ్యాక్సినేషన్ కోసం వెళ్లేవారికి ప్రత్యేకంగా పాస్లు అవసరం లేదని చెప్పారు. సంబంధిత రికార్డులను చూపిస్తే సరిపోతుందన్నారు. వేరే రాష్ర్టాల నుంచి వచ్చేవారి వద్ద ఈ పాస్లు ఉంటే అనుమతిస్తున్నామని చెప్పారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ కామర్స్ వారు 6 నుంచి 10 గంటల వరకు ఏ వస్తువులనైనా డెలివరీ చేసుకోవచ్చని స్పష్టంచేశారు. పది గంట తర్వాత మందులు, కరోనా బాధితులకు మాత్రమే ఆహార సరఫరాకు అనుమతిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఎస్పీలు, సీపీలు లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తున్నారని ప్రశంసించారు