ములుగు, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. గురువారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రాపురం పోలీస్ హెడ్క్వార్టర్స్కు చేరుకున్న ఆయన.. రెండు జిల్లాల అధికారులతో సమీక్షించారు.
అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలోని వెంకటాపురం పోలీస్ సర్కిల్ అలుబాక వద్ద అత్యాధునిక హంగులతో నిర్మించిన పోలీస్ క్యాంపును డీజీపీ ప్రారంభించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విభాగాల అధికారుల సమష్టి కృషి వల్లే మావోయిస్టుల నిర్మూలన సాధ్యమైందని చెప్పారు.
రాష్ట్ర సరిహద్దుల్లో కెమెరాలు ఏర్పాటు చేశామని, మావోయిస్టుల కదలికలు ఉండే అవకాశం ఉన్న చోట కూడా సీసీ కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. డీజీపీ వెంట గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీనివాసరెడ్డి, నార్త్ జోన్ అదనపు డీజీపీ వై నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా, ఎస్ఐబీ ఆపరేషన్స్ చీఫ్ ప్రభాకర్రావు, ములుగు, కొత్తగూడెం ఎస్పీలు సంగ్రామ్సింగ్ జి.పాటిల్, వినీత్ గంగన్న తదితరులు ఉన్నారు.