రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో శాంతిభద్రలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా జిల్లా పోలీస్, కమిషనర్ కార్యాలయాలను కొత్త జిల్లాల్లో నిర్మిస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని శనివారం తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎస్పీ చేతన్తో కలిసి నూతన భవనాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ దశలో పెండింగ్లో ఉన్న పనుల వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు సత్వర పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల సముదాయాలను నిర్మిస్తుందని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్స్, డిజైనర్స్, ఆర్కిటెక్చర్స్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
త్వరలోనే ప్రజలకు వాటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో పోలీస్శాఖకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖలో మొదటి ప్రాధాన్యతగా రాష్టంలో అన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, తర్వాత పోలీస్ అధికారులు ఉండేందుకు క్యాంప్ కార్యాలయాలు పోలీస్ సిబ్బంది ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ విజయ్ కుమార్, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు ఎస్పీ చందయ్య, ఇన్చార్జి డీఆర్వో టీ శ్రీనివాస రావు, డీఎస్పీ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.