మేడ్చల్ : దేశానికే తెలంగాణ పోలీసు గర్వకారణమని, కేసుల దర్యాప్తులో సాంకేతిక వినియోగంలో ముందంజలో ఉన్నామని డీజీపీ అంజనీకుమార్ యాదవ్ (DGP Anjani Kumar Yadav) అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్క నాటారు. అనంతరం సీసీ కెమెరాల నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు జరిగాయన్నారు. సిటీజన్ సెట్రిక్ పోలీసింగ్, సిటీజన్ ఫ్రెండ్లీ పోలిసింగ్ సమర్దవంతంగా అమలు అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పటిష్ట భద్రత అమలవుతుండటంతో బహుళ జాతి సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర ఎన్నో సంస్థలు పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ (CM KCR) సూచనల మేరకు పోలీసులు పౌరులకు ఉన్నతంగా సేవలందిస్తున్నారని తెలిపారు. తగిన శిక్షణతోనే ఉత్తమంగా పోలీసులు సేవలందిస్తారన్న ఉద్దేశంతో శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 28 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని శిక్షణా కేంద్రాల్లేవని ఆయన చెప్పారు. రాష్ట్రం పోలీసులు ప్రజలకు ఉత్తమంగా సేలందించేందుకు, నేరాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని డీజీపీ చెప్పారు. నిరంతరం నిఘా కోసం విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దేశంలో ఉన్న సీసీ కెమెరా (CC Camera) ల్లో 60 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పారు. పోలీస్ శిక్షణా కేంద్రాల్లో కొత్తగా విధుల్లోకి వస్తున్న వారితో పాటు సర్వీసులో ఉండి, పదోన్నతి పొందిన వారికి కూడా శిక్షణనిస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారు ప్రభుత్వం పోలీసులకు అన్ని అవకాశాలను కల్పిస్తుందని, ఆర్మ్డ్, బెటాలియన్, సివిల్ తదితర ఏ విభాగాల్లో పని చేస్తున్నా ఉత్తమంగా ప్రజలకు సేవలందించాలన్నారు.
సైబర్ క్రైం (Cyber Crime), మాదకద్రవ్యాలు సమాజంలో పెరిగిపోయాయని, తగిన శిక్షణ పొందిన పోలీసులు వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐజీ డాక్టర్ తరుణ్జోషి, ప్రిన్సిపాల్ పరవస్తు మధుకర్ స్వామి, మేడ్చల్ ఏసీపీ సామల వెంకట్ రెడ్డి , డీఎస్పీలు జగన్, పిచ్చయ్య, లక్ష్మి, లక్ష్మీకాంత్ రెడ్డి, విజయ్కుమార్, శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు వెంకట్రెడ్డి, సూర్యనారాయణ, ఏవో రామారావు పాల్గొన్నారు.