హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోలీసు శిక్షణకు సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు క్రమశిక్షణ, విజ్ఞానంతో మెలిగి పోలీసు వృత్తికి వన్నె తీసుకురావాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాక్షించారు. క్రమశిక్షణలేని విజ్ఞానం ఎందుకూ కొరగాదని పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ బాధ్యత పూర్తిగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లపైనే ఉందని, వారికి క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ట్రైనింగ్ ఐజీ తరుణ్జోషీ నేతృత్వంలోని 29 పోలీసు శిక్షణ సంస్థల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లతో డీజీపీ అంజనీకుమార్ మంగళవారం వర్క్షాపు నిర్వహించారు. సివిల్, ఏఆర్, ఐటీ అండ్ సీ, మెకానిక్, డ్రైవర్ల విభాగాలకు చెందిన 9,871 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు విధినిర్వహణలో మెరుగైన ప్రదర్శన కనబర్చించేదుకు ఎప్పటికప్పుడు విజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణ తీసుకోబోయే కానిస్టేబుళ్లు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. క్రమశిక్షణ రాహిత్యం, దుష్ప్రవర్తనను పోలీసుశాఖ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు.
నిపుణులైన ట్రైనర్లతో అభ్యర్థులకు ఆన్లైన్ సెషన్లు నిర్వహించాలని ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషీని కోరారు. రెగ్యులర్ శిక్షణ తరగతులతో పాటు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా అటవీ అధికారి, విశ్వవిద్యాలయాల సీనియర్ ప్రొఫెసర్లు, ఇతర విద్యావేత్తలతో స్పెషల్ ఇంటరాక్షన్ తరగతులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో శిక్షణ సంస్థల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టినట్టు తరుణ్ జోషీ తెలిపారు. శిక్షణ సంస్థల్లో రూ.కోటికి పైగా ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు పీఅండ్ఎల్ ఐజీ రమేశ్రెడ్డి తెలిపారు. వర్క్షాపులో సైబరాబాద్ డీసీపీ అడ్మినిస్ట్రేషన్ యోగేష్ గౌతమ్, 4వ బెటాలియన్ కమాండెంట్ సిం ధుశర్మ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ తులసీధర్ పాల్గొన్నారు.