హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మర్యాదపైనే పోలీస్ శాఖ ప్రతిష్ట ఆధారపడి ఉన్నది. దానిని పెంపొందించడంలో రిసెప్షన్ అధికారులు కీలకంగా వ్యవహరించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం రాష్ట్రంలోని పోలీస్స్టేషన్ల రిసెప్షన్ ఆఫీసర్స్, స్టాఫ్ ఫంక్షనల్ వర్టికల్స్పై 736 మంది అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే అర్జీదారుల సమస్యలను ఓపికగా విని, సమస్యను తప్పకుండా తీరుస్తారనే విశ్వాసాన్ని వారిలో కల్పించాలని చెప్పారు. సౌమ్యత, మర్యాద, ఆప్యాయత అనేవి రిసెప్షన్ అధికారికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. మహిళా పిటిషనర్ల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. అనంతరం హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాన్ని డీజీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ నెల 13 నుంచి 17 వరకు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన 66వ ఆలిండియా పోలీస్ డ్యూటీమీట్లో పతకాలు సాధించిన తెలంగాణ పోలీసులను డీజీపీ సత్కరించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ సృష్టికర్త పురుషోత్కుమార్ను డీజీపీ తన కార్యాలయంలో సత్కరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీజీ మహేశ్ భాగవత్, అదనపు ఎస్పీ సీవోవో సత్యనారాయణ పాల్గొన్నారు.