హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయిన మెదక్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఖదీర్ఖాన్ మృతి ఘటనపై డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. దొంగతనం కేసులో ఖదీర్ను అరెస్టు చేసి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లనే అతను చనిపోయాడనే అభియోగాలు రావడంతో ఈ కేసును పకడ్బందీగా విచారించాలని ఐజీపీ చంద్రశేఖర్రెడ్డిని డీజీపీ ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన (సస్పెన్షన్) చర్యలు తీసుకున్నట్టు డీజీపీ శనివారం తెలిపారు.
సిద్దిపేటకు చెందిన ఖదీర్ఖాన్ ఈ నెల 16న గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చోరీ కేసులో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27న సిద్దిపేట పట్ణంలోని అరబ్గల్లీ గొలుసు చోరీ జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖదీర్ఖాన్ను గత నెల 29న అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 2వ తేదీ వరకు పోలీస్స్టేషన్లోనే ఉంచి ఆ తర్వాత అతడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి.. అతడి భార్యను పిలిపించి ఖదీర్ను ఆమెకు అప్పగించారు. ఖదీర్ అనారోగ్యానికి గురికావడంతో తొలుత మెదక్ ప్రభుత్వ దవాఖాన, తర్వాత ఓ ప్రైవేటు దవాఖానకు అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఖదీర్ తుదిశ్వాస విడిచాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
దొంగతనం కేసులో ఖదీర్ను అరెస్టు చేసి, పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఖధీర్ భార్య తెలిపింది. ఈ క్రమంలోనే అతను అనారోగ్యానికి గురై గాంధీ దవాఖానలో చికిత్స పొందుతుండగా చనిపోయాడని ఆమె పేర్కొన్నది. ఖధీర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాల పెద్దలు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని కోరడంతో ఆమె ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియ ఎమ్మెల్యేకు తెలిపారు. చిరు వ్యాపారి అయిన ఖదీర్కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.