హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సినిమాల్లో పోలీసులను అత్యంత క్రూరులుగా చూపించవద్దని, వారి పాత్రలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని డీజీపీ అంజనీకుమార్ కోరారు. హైదరాబాద్లో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘మార్పునకు ఉత్ప్రేరకం సినిమా’ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో రాష్ట్ర పోలీసులు 24 గంటలపాటు ప్రజలకు విశేషమైన సేవలందించారని కొనియాడారు. ఈ సమయంలో 5,600 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని, వారిలో 200 మంది ప్రాణాలొదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సమాజ కోసం వెలకట్టలేని త్యాగాలు చేస్తున్నారని, ఆ త్యాగాలను నేటి దర్శక, నిర్మాతలు గుర్తించాలని హితవు పలికారు. సామాజిక చైతన్యం తీసుకొచ్చే సినిమాలు నిర్మించాలని ఆకాక్షించారు. మహిళా చైతన్యవంతమైన సినిమాలు ఇంకా రావాలని డీజీపీ కోరారు.