హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : వేసవిలో అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 18 ఫైర్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. మంటలు ఆర్పేందుకు సరికొత్త టెక్నాలజీ అందిపుచ్చుకొంటూ దీటుగా ప్రమాదాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని ఫైర్ ట్రైనింగ్ స్కూల్ లో అగ్నిమాపకశాఖ వారోత్సవాల పోస్టర్ను నాగిరెడ్డి ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల్లో అమరులైన సిబ్బందికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా 39 ఫైరింజన్లు, 18 మినీ ఫైరింజన్లు, ఫైర్సూట్స్, బ్రీతింగ్ కిట్స్, స్మోక్ ఎక్యిప్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
వచ్చే వర్షాకాలానికి కూడా 20 బోట్లు, లైఫ్బాయ్స్ను కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. 86 బిల్డింగ్ల యజమానులకు ఫైర్ సేఫ్టీ సామగ్రి పెట్టించుకోవాలని నోటీసులు ఇచ్చామని నాగిరెడ్డి వివరించారు. కేర్లెస్ స్మోకింగ్ వల్ల అధికంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయని, సిగరెట్, బీడీలు, చుట్టలు తాగేవారు.. వాటిని రోడ్డుమీద పడేయకుండా పూర్తిగా ఆర్పివేయాలని కోరారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20 వరకు ఆస్పత్రులు, స్కూల్స్, మాల్స్, భవన సముదాయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. వీటితోపాటు వర్క్షాపులు, సెమినార్లు, గెస్ట్లెక్చర్స్, డ్రాయింగ్ పోటీలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని నాగిరెడ్డి తెలిపారు. అనంతరం వట్టినాగులపల్లి ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్న 487 మంది ఫైర్ ట్రైనీలకు దిశానిర్దేశం చేశారు. పలు క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ జీవీ నారాయణరావు, ఆర్ఎఫ్వో హరినాథ్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్రావు, డీఎఫ్వోలు, ఏడీఎఫ్లు పాల్గొన్నారు.