హైదరాబాద్/ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేవులపల్లి ప్రభాకర్రావు వరంగల్ పట్టణంలో ఆండాళమ్మ, వేంకట చలపతిరావు దంపతులకు 1938లో జన్మించారు.
ఉస్మానియా యూనివర్సి టీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రచురణ విభాగంలో పనిచేశారు. ఆ తరువాత కుటుంబ సంక్షేమవాణి మాసపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, ప్రజాతంత్ర పత్రికల్లో అనేక ఏండ్లు కాలమిస్టుగా సేవలందించారు. గోల్కొండ, విశాలాంధ్ర పత్రికల్లో పలు అంశాల మీద రచనలు చేశారు. దేవులపల్లి రాసిన ‘మహాకవి గురజాడ జీవితం-సాహిత్యం’ గ్రంథానికి యునెస్కో అవార్డు లభించింది. జాతీయ సమైక్యతపై రాసిన ‘నేను ఎవరు’ పుస్తకానికి భారత ప్రభుత్వ అవార్డు, అల్లూరి సీతారామరాజు రేడియో నాటికకు జాతీయ అవార్డు అభించాయి. సాహిత్యరంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2009లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం, 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య పురస్కారం లభించాయి. 2016 ఏప్రిల్ 29న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మన్గా నియమితులయ్యారు.
దేవులపల్లి ప్రభాకర్రావు మృతి పట్ల మంత్రి కే తారకరామారావు సంతాపం వ్యక్తంచేశారు. ప్రభాకర్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, కొప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంతాపం ప్రకటించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ 1982 నుంచి దేవులపల్లి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు.
తెలంగాణ వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న ప్రభాకరరావు తన రచనల ద్వారా 1969 తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. చెన్నారెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజా సమితికి వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగారు. చెన్నారెడ్డి టీపీఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసిన సందర్భంలో తెలంగాణను తాకట్టు పెట్టారంటూ తీవ్రంగా విమర్శించారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలోనూ దేవులపల్లి ప్రభాకరరావు తన వంతు కీలక పాత్ర పోషించారు. శక్తివంతమైన వ్యాసాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఉస్మానియా నుంచి మానుకోట వరకు ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో ఆయన రాసిన వ్యాసాల సంపుటి తెలంగాణ ఉద్యమ చరిత్ర, ప్రస్థానాన్ని కండ్లకు కట్టింది. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో తెలంగాణను అడ్డుకొనేందుకు సమైక్య పాలకులు చేసిన కుట్రలు, కాంగ్రెస్, టీడీపీ నేతలు పన్నిన పన్నాగాలను ఉన్నది ఉన్నట్టుగా గ్రంథస్థం చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు.