రాజన్న సిరిసిల్ల/వేములవాడ : మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. మేడారం సమ్మక్కను దర్శించుకునేముందు రాజన్నను దర్శించుకోవడం ఇక్కడకు వచ్చే భక్తులకు ఆనవాయితీ.
ఈ క్రమంలో స్వామి వారి ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. వేకువజాముననే భక్తులు తమ ప్రీతి మొక్కైన కోడె మొక్కు చెల్లించుకోవడం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
పట్టణంలో ఎక్కడ చూసినా భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఆలయ పార్కింగ్ స్థలంలో ఎటు చూసినా వాహనాలే కనిపించాయి. ఉదయం 11 గంటల వరకే స్వామివారిని దాదాపు 25 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.