హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తేతెలంగాణ): ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మ దర్శనానికి 5 గంటలకుపైగా సమయం పట్టింది. భవానీ మాలధారుల రాకతో కొండపై రద్దీ బాగా పెరిగింది.
బుధవారం ఉదయం 11 గంటలకు చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించగా, సాయంత్రం 4 గంటలకు జమ్మిదొడ్డి నుంచి దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్కు తీసుకెళ్లారు. భారీగా వరద వస్తుండటంతో నదీ విహారాన్ని రద్దు చేశారు. తెప్పోత్సవంలో వేదపండితులు, అర్చకులు, అధికారులు మాత్రమే పాల్గొన్నారు.