రాజన్న సిరిసిల్ల : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేకువజాముననే స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లలో బారులు తీరారు. భక్తులు స్వామి వారికి కోడె మొక్కు తీర్చుకోవడం కోసం దాదాపు రెండుగంటల పాటు క్యూ లైన్లో నిలబడి మొక్కులు తీర్చుకున్నారు.
ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు, చండీ హోమం, కుంకుమ్బపూజలు, గుండా దీపం మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాల వద్ద భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులతో రాజన్న ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.