ములుగు : వరాలిచ్చే దేవతలు, ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలను సమర్పించారు.
సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు ఎక్కువగా తరలిరావడంతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. అమ్మవార్ల దర్శనం అనంతరం యాటపోతులను సమర్పించి గద్దెల పరిసరాలతో పాటు చిలుకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో విడిది చేసి విందుభోజనాలు చేశారు. బుధవారం సుమారు లక్షకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.