చేర్యాల, ఫిబ్రవరి 2 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మల్లన్నక్షేత్రానికి భారీగా(Devotees flock) తరలివస్తున్నారు. 3వ ఆదివారం స్వామి వారి నామస్మరణలతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. ఆదివారం సందర్భంగా 30వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్ర లేచి పవిత్ర స్నానం ఆచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు.
అంతేకాకుండా మరికొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం, మల్లన్నకు అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించడంతో పాటు గుట్ట పై ఉన్న ఎల్లమ్మకు ఒడి బియ్యం పోసి బోనం సమర్పించుకున్నారు. ఈ సందర్బంగా భక్తులకు ఎలాంటి సమస్యలు తలేత్తకుండా ఈవో కే.రామాంజ నేయులు, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీరాములు, సురేందర్రెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పాలక మండలి సభ్యులు, సిబ్బంది,అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు.
ఆలయ వర్గాలకు పోలీసులకు వాగ్వాదం ?
కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం భక్తులను ఇతర మార్గాల నుంచి తీసుకువస్తున్నారనే అంశం పై ఆలయ అధికారులు, కొమురవెల్లి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న క్రమంలో ఆలయ క్యూలైన్ల నుంచి కాకుండా ఇతర మార్గాల నుంచి పోలీసులు ప్రోటోకాల్ పేరిట పలువురిని తీసుకువస్తుండడంతో ఆలయ సిబ్బంది కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాము దర్శనాలకు రాలేదని, ప్రోటోకాల్ మేరకు డ్యూటీ చేస్తున్నామని సదరు అధికారి కొమురవెల్లి ఎస్ఐ రాజు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.