యాదాద్రి, అక్టోబర్ 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. దసరా సెలవులతోపాటు రెండో శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమాడ వీధులు, క్యూలైన్లు భక్తులతో రద్దీగా మారాయి. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణిలో భక్తుల సందడి నెలకొన్నది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. కొండ కింద పార్కింగ్ ప్రాంగణం వాహనాలతో నిండిపోయింది. ధర్మదర్శనానికి 6 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని 38 వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.40,29,719 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.