వేమనపల్లి/ కోటపల్లి / కౌటాల/కాళేశ్వరం, ఏప్రిల్ 17: ప్రాణహితలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సెలవురోజు కావడంతో ఆదివారం దాదాపు రెండు లక్షల మంది తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, అర్జునగుట్ట, కౌటాల, వేమనపల్లితోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నదీస్నానాలు చేశారు. నదిలో దీపాలు వదిలి, వాయినాలు సమర్పించారు. జలతర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పుష్కరాలకు వస్తున్నారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నదికి అర్చకులు హారతి ఇచ్చారు. వరంగల్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి భక్తులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు.