హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత, కృష్ణా జలాల్లో వాటాలు, పోతిరెడ్డిపాడు విస్తరణ తదితర అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సోమవారం ‘కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలు, ప్రభుత్వ విధానాలు’ పేరిట ఒక పీపీటీని రూపొందించి ప్రదర్శించింది. కేఆర్ఎంబీ బోర్డు సమావేశాలకు సంబంధించిన అంశాలను అందులో పొందుపరిచింది. పలు వీడియోలను సాక్ష్యాలుగా ప్రదర్శించింది. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ సైతం ‘కృష్ణా నదీ జలాలపై కాంగ్రెస్ అబద్ధాలు- బీఆర్ఎస్ వాస్తవాలు’ పేరిట ఒక పీపీటీని విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రదర్శించిన వీడియోలకు సమాధానంగా పలు వీడియోలు విడుదల చేసింది. ప్రభుత్వ వాదనలను బలంగా తిప్పికొట్టింది. ప్రభుత్వం మరుగుపరచిన వాస్తవాలను ఆధారాలతో బయటపెట్టింది.
కాంగ్రెస్ అబద్ధం: ప్రాజెక్టుల అప్పగింతకు 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.బీఆర్ఎస్ వాస్తవం: అది పూర్తిగా అవాస్తవం. కేఆర్ఎంబీకి అప్పగించలేదు. ఎందుకంటే విషయం సుప్రీం కోర్టులో పరిధిలో ఉందని అప్పటి సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అందుకు సంబంధించి మీటింగ్ మినిట్స్ను కూడా పీపీటీలో జతచేసింది.
కాంగ్రెస్ అబద్ధం: ఆపరేషన్ ప్రొటోకాల్, రూల్కర్వ్లను ఖరారుచేసిన అనంతరం వెంటనే ప్రాజెక్టులను అప్పగించేందుకు కేంద్రానికి బీఆర్ఎస్ హామీ ఇచ్చింది.
బీఆర్ఎస్ వాస్తవం: అది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ సెక్రటరీ రాహుల్బొజ్జ కేంద్రానికి రాసిన లెటర్లో ఆపరేషన్ ప్రోటోకాల్పై నిర్ణయం కాలేదు కాబట్టి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు గత ప్రభుత్వం ఒప్పుకోలేదని స్పష్టంగా వెల్లడించారు. ఆయన లేఖనే ఇందుకు సాక్ష్యం.
కాంగ్రెస్ అబద్ధం : కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కేసీఆర్ ఎప్పుడూ అడగలేదు.
బీఆర్ఎస్ వాస్తవం: ప్రతి సందర్భంలో కేసీఆర్ న్యాయమైన వాటాకోసం అడిగారు. న్యాయమైన వాటా తేల్చాలని మినిట్స్ ఆఫ్ మీటింగ్లో కేంద్రమే వెల్లడించింది. న్యాయమైన వాటా తేల్చాలని కోరుతూనే గత ప్రభుత్వం 27 లేఖలు రాసింది. తేదీల వారీగా రాసిన లేఖలను బహిర్గత పరిచింది.
కాంగ్రెస్ అబద్ధం: ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదు.
బీఆర్ఎస్ వాస్తవం: కాంగ్రెస్ సర్కారే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను, 15 ఔట్లెట్లను అప్పగించింది. అందుకు జనవరి17న కేంద్ర జల్శక్తిశాఖ నిర్వహించిన, ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీ నిర్వహించిన సమావేశ మినిట్స్ సాక్ష్యం. పత్రికాముఖంగా ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు మాట్లాడిన వీడియోలను కూడా బీఆర్ఎస్ ప్రదర్శించింది.
కాంగ్రెస్ అబద్ధం: కృష్ణా జలాల తరలింపులో ఏపీకి కేసీఆర్ సహకరించారు.
బీఆర్ఎస్ వాస్తవం: కేవలం సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మాత్రం మళ్లించి ఇటు తెలంగాణకు, అటు ఆం ధ్రాకు మేలు చేయాలని మాత్రమే నిర్ణయించారు.
కాంగ్రెస్ అబద్ధం: రాయలసీమ లిఫ్ట్పై కేసీఆర్ స్పందించలేదు.
బీఆర్ఎస్ వాస్తవం: ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులకు జీవో ఇవ్వక ముందే దానిపై ఫిర్యాదు చేస్తూ కేంద్రజల్శక్తిశాఖకు బీఆర్ఎస్ సర్కారు 10కిపైగా లేఖలు రాసింది. అందుకు సంబంధించిన తేదీలతో సహా లేఖలను బయటపెట్టింది. 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఆయా అంశాలను లేవనెత్తింది. రాయలసీమ లిఫ్ట్ను తీవ్రంగా తప్పుబట్టింది. అందుకు ఆ మీటింగ్ మినిట్సే సాక్ష్యమని వివరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రజల్శక్తిశాఖ ఏపీకి లేఖ రాసిందని, లిఫ్ట్ పనులు ఆపాలని ఆదేశించిందని తెలిపింది. అందుకు సంబంధించిన లేఖను కూడా బయటపెట్టింది. గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి సీమలిఫ్ట్ పనులపై స్టే కూడా తీసుకొచ్చిందని వివరించింది.
కాంగ్రెస్ అబద్ధం: పోతిరెడ్డిపాడు విస్తరణ చేపట్టినా పదవుల కోసం బీఆర్ఎస్ పెదవులు మూసుకుంది.
బీఆర్ఎస్ వాస్తవం: పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో అప్పటి ప్రభుత్వంలో లేము. మంత్రివర్గంలో భాగస్వామిగా కూడా లేము. అంతకు రెండు నెలల ముందుగానే మంత్రిపదవులకు ఇదే విషయమై రాజీనామా చేశాం. బహిరంగంగానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశాం.
కాంగ్రెస్ అబద్ధం: కేంద్రం జారీచేసిన రివర్బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ను బీఆర్ఎస్ వ్యతిరేకించలేదు.
బీఆర్ఎస్ వాస్తవం: అది తప్పు. గెజిట్ను వ్యతిరేకిస్తూ అప్పటి స్పెషల్ సీఎస్ రజత్కుమార్ 2021లోనే కేంద్రానికి లేఖ రాశారు. ఆ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం నియమించిన ప్రస్తుత కార్యదర్శి రాహుల్బొజ్జానే తన లేఖలో స్పష్టంగా వెల్లడించారు.