హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బీ పార్థసారథిరెడ్డి, గాయత్రి గ్రానైట్ సంస్థ వ్యవస్థాపకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ని ముఖ్యమంత్రి ఎంపికచేశారు. అభ్యర్థులు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి బీ-ఫామ్స్ అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలుకు గురువారమే తుది గడువు. ఆ స్థానానికి వద్దిరాజు రవిచంద్రను ఎంపిక చేశారు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ శ్రీనివాస్ పదవీకాలం జూన్ 21తో ముగియనుండటంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా దీవకొండ దామోదర్రావు, పార్థసారథిరెడ్డి ఎంపికయ్యారు. వెలమ, రెడ్డి, బీసీ (మున్నూరు కాపు) సామాజిక వర్గాల అభ్యర్థులను టీఆర్ఎస్ ఎంపిక చేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఉద్యమగొంతుకగా నిలిచిన తెలంగాణ పబ్లికేషన్స్ స్థాపనలో కీలకభూమిక పోషించిన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, ఫార్మసీ రంగంలో తెలంగాణ సత్తా చాటిన హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ పార్థసారథిరెడ్డి, సామాన్య కుటుంబంలో జన్మించి గ్రానైట్ వ్యాపారంలో శిఖరంలా ఎదిగిన వద్దిరాజు రవిచంద్రను పెద్దల సభకు ఎంపిక చేయటంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శాసనమండలి, శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ అజేయశక్తిగా ఉన్నందున మూడింటికి మూడుస్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
గ్రానైట్ వ్యాపారంలో తిరుగులేని రవిచంద్ర
ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి (ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా)కు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవిచంద్ర) బీకాం పూర్తిచేశారు. 1964 మార్చి 22న జన్మించారు. బీసీ (మున్నూరు కాపు) సామాజిక వర్గానికి చెందిన ఆయన స్వగ్రామంలో తొలుత రైస్మిల్ వ్యాపారంలో అడుగుపెట్టారు. అనంతరం గ్రానైట్ రంగంలోకి ప్రవేశించారు. ఇనుగుర్తి స్ఫూర్తితో అనేక సేవా, క్రీడా కార్యక్రమాలను అలవరుచుకొని వాటిని కొనసాగిస్తూ వస్తున్నారు. గ్రానైట్ వ్యాపారంలో స్థిరపడి స్వల్పకాలంలోనే ఉన్నత శిఖరాలకు చేరారు. ప్రస్తుతం తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా కొనసాగు తున్నారు. అలాగే తెలంగాణ మున్నూరు కాపు ఆల్ ఆసోసియేషన్ జేఏసీ, నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్, రాజరాజేశ్వరి మున్నూరుకాపు నిత్యాన్నదానసత్రం సహా పలు సంస్థలకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. 2018లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. 2019లో టీఆర్ఎస్లో చేరారు. వ్యాపార సంస్థ గాయత్రినే ఇంటిపేరుగా (గాయత్రి రవిచంద్ర)గా మార్చుకొన్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో గాయత్రి రవి వ్యాపారాన్ని విస్తరించారు.
పల్లె నుంచి ఎదిగిన ఫార్మా కింగ్
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుం దూరులో 1954, మార్చి 6న బండి పార్థసారథిరెడ్డి జన్మించారు. పదో తరగతి, ఇంటర్ స్వగ్రామంలోనే చదివి డిగ్రీ సత్తుపల్లిలో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ చేశారు. రెడ్డిల్యాబ్స్లో ఉద్యోగం చేసి, అనంతరం 1993లో హెటిరో డ్రగ్స్ కంపెనీని స్థాపించారు. హెటిరో సంస్థ రూ.8000 కోట్ల టర్నోవర్తో 18 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఫార్మారంగంలో ఆయన చేసిన సేవలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అవార్డులతో సత్కరించాయి.
తెలంగాణ ఉద్యమానికి అండ దీవకొండ
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన దామోదర్రావు 1958 ఏప్రిల్ 1న జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ చేశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటి నుంచి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తుల్లో దీవకొండ దామోదర్రావు ఒకరు. 2001 నుంచి టీఆర్ఎస్లో పలు హోదాల్లో పనిచేశారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్గా వ్యవహరించారు. మలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ న్యూస్ చానల్, నమస్తే తెలంగాణ దినపత్రికల స్థాపనలో దీవకొండది ప్రధాన భూమిక. తెలంగాణకు సొంత మీడియా సంస్థలు ఉండాలని నాటి ఉద్యమ నేత కేసీఆర్కు వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా రెండు మీడియా సంస్థలను నెలకొల్పడంలో దామోదర్రావు సహకారం అందించారు. టీ న్యూస్ చానల్కు తొలి ఎండీగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ సంస్థకు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ పబ్లికేషన్ను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ తలచిన వెంటనే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకొన్నారు. తెలంగాణ పబ్లికేషన్స్ (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు)కు ప్రస్తుతం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా సేవలందించారు.