హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవం పేరిట జరుగుతున్న విధ్వంసం, గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై నిరసనలు వెల్లువెత్తుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూటు మార్చింది. పురాతన ఆలయ అభివృద్ధి పేరుతో మూసీ పునరుజ్జీవ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఆధ్యాత్మిక సంప్రదాయం ముసుగుతో మంచిరేవుల వద్ద ఉన్న చారిత్రక మచిలేశ్వర వీరభద్రదేవాలయం నుంచి మూసీ అభివృద్ధి పనులు చేపడితే ప్రజల నుంచి వ్యతిరేకత రాదని భావించి ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 28న ఈ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. దీంతో అధికారులు రెండ్రోజులుగా వీరభద్రస్వామి దేవాలయ సమీపంలో పిచ్చిమొక్కలను తొలగించి, రహదారిని చదును చేయిస్తున్నారు.
కాకతీయుల కాలంనాటి ఈ చారిత్రక దేవాలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు రేవంత్రెడ్డి సర్కార్ చెప్తున్నప్పటికీ రూ.వేల కోట్లతో వేలాది ఎకరాల్లో చేపట్టే గాంధీ సరోవర్ ప్రాజెక్టు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ తతంగానికి పూనుకున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండిపేట చెరువు దిగువన మూసీ కాలువ ప్రారంభమయ్యే దగ్గర 100 అడుగుల శివుడి విగ్రహాన్ని నెలకొల్పడంతోపాటు తూర్పు భాగాన మూసీకి ఎదురుగా నగరానికి తలమానికంగా కనిపించేలా 64 అడుగుల ఎత్తయిన ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు వినికిడి.
ఆలయానికి ఆరెకరాలు.. అభివృద్ధికి 20 ఎకరాలు
మంచిరేవులలోని మచిలేశ్వర వీరభద్రస్వామి ఆలయానికి ఆరు ఎకరాల భూమి ఉన్నది. చుట్టూ ఉన్న భూములను గతంలో గ్రేహౌండ్స్కు కేటాయించారు. వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఓంకారేశ్వర ఆల యం, పర్యాటక కేంద్రం, బోటింగ్ వసతుల ఏర్పాటు పనులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు 20 ఎకరాలు అవసరమవుతాయని అధికారులు చెప్తున్నారు. మూసీ ఎగువ ప్రాంతంలో విల్లాలు, పట్టాభూములు ఉన్నాయి. కొన్నింటికి పేద రైతులు అసైనీలుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం గ్రేహౌండ్స్ భూములను తీసుకుని ఆలయ అభివృద్ధి చేపట్టే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కానీ, ఆ భూముల సేకరణపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.