జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు కొత్త జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే అర్థమవుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడటం ద్వారా అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేపట్టిన పలు పనులకు మంత్రి హరీశ్రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మా తండాలు మేం పాలించుకోవాలి అంటే గిరిజనుల కోరికను ఎవరూ పట్టించుకోలేదు. కాని సీఎం కేసీఆర్ 3,146 గ్రామ పంచాయతీలుగా చేసి 75 ఏళ్ల గిరిజనుల కలను నెరవేర్చారు. సర్పంచులు చేయడమే కాకుండా ఆత్మగౌరవంతో తామే పాలించుకునేలా చేశారు. 12 వేల 56 కోట్లు గిరిజన సంక్షేమం కోసం మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బడ్జెట్ లో పెట్టించకోగలిగామన్నారు.
అంతే కాదు గిరిజన గ్రామ పంచాయతీలకు పరిపాలన భవనాలు నిర్మించుకోనున్నాం. జయశంకర్ జిల్లాలో ఎక్కువ నిధులు కేటాయించి గిరిజన తండాలకు బీటీ రోడ్లు వేయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని ప్రశంసించారు.