హైదరాబాద్, ఫిబ్రవరి 24 : జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కును దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
జూ అభివృద్ధికి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు.
జూపార్కులో లేని చాలా జంతువులను తీసుకొచ్చాం. మరికొన్నింటిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గురువారం మంత్రి అధ్యక్షతన జాపాట్ (జ్యూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) కార్యవర్గ సమావేశం జరిగింది.
నిర్మల్ నుంచి వర్చువల్ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కుతో పాటు రాష్ట్రంలోని 8 పార్కుల్లో వన్యప్రాణుల సంరక్షణ, పార్కుల అభివృద్ది, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు.
నెహ్రూ జూ పార్క్, హైదారాబాద్కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను రూపొందిస్తున్నట్లు పీసీసీఎఫ్ ఆర్ శోభ తెలిపారు. వెబ్ సైట్ లో సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు టికెట్ బుకింగ్, విరాళాలు, వన్య ప్రాణుల దత్తత వంటి ఇతర ఆన్ లైన్ సేవలను అందుబాటులోని తీసుకురానున్నట్లు వివరాలను వెల్లడించారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ బ్లాక్ లను అర్బన్ ఫారెస్ట్ పార్కుల పనుల పురోగతి, నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు గానూ 37 పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు.
అయితే మరో 16 పార్కుల పనులు పూర్తైన ఇంకా ప్రారంభిచుకోలేదని, సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న మరో 56 పార్కుల అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం, డొబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎ.కే సిన్హా, జూ పార్క్ డైరెక్టర్ ఎంజే అక్బర్, హైదరాబాద్ డిఎఫ్.వో జోజి, జూ పార్కు క్యూరేటర్ రాజశేఖర్, శంషాబాద్ ఎఫ్.డి.వో విజయానంద రావు, తదితరులు పాల్గొన్నారు.