Nagarkurnool | నాగర్కర్నూల్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్నూల్ జిల్లా సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. సాగు, తాగునీటితో పాటుగా విద్య, వైద్య, రవాణా, ఇతర రంగాల్లో వచ్చిన మార్పులతో జిల్లా ముఖచిత్రం మారిపోయింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎంజీకేఎల్ఐని 2015లో ప్రారంభించుకోగా, జూలైలో పాలమూరు రంగారెడ్డి పథకం నీరు సాగు భూములను తడుపనున్నది. నూతనంగా రూ.52 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్, రూ.35 కోట్లతో చేపట్టిన పోలీసు భవన సముదాయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు.
తెలంగాణ ఏర్పాటు నాగర్కర్నూల్ అభివృద్ధిలో నవశకాన్ని తీసుకొచ్చింది. స్వరాష్ట్ర ఉద్య మ కలలో మొదటిదైన నీళ్ల సమస్య పరిష్కారమైంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎంజీకేఎల్ఐని 2015లో ప్రారంభించారు. సింగోటం, ఎల్లూరుతోపాటు జొన్నలబొగుడ, గుడిపల్లి లిఫ్టుల ద్వారా జిల్లాలో దాదాపుగా 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో 8.51 టీఎంసీలతో అంజనగిరి, బిజినేపల్లి మండలం వట్టెంలో 16.74 టీఎంసీల సామర్థ్యంతో వెంకటాద్రి రిజర్వాయర్ల నిర్మాణం జోరందుకున్నది. జూలై నాటికి ఈ లిఫ్టుల నుం చి సాగునీళ్లు వచ్చేలా అధికార యంత్రాంగం పని చేస్తున్నది. అచ్చంపేటను సస్యశ్యామలం చేసేలా 70 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 5 టీఎంసీల సామర్థ్యంతో ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్ల నిర్మాణాలకు సర్వే పనులు పూర్తి చేసి స్టేజ్-1 కింద 57,200 ఎకరాలకు నీరు అందించేందుకు రూ.1,534 కోట్ల పరిపాలన అనుమతులు వచ్చాయి. స్టేజ్-2 కింద 14,400 ఎకరాలకు నీరందించేందుకు రూ.687.50 కోట్లతో అనుమతులకోసం ప్రభుత్వానికి పంపించారు. రూ.76 కోట్లతో బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి వద్ద మార్కండేయ రిజర్వాయర్ నిర్మించనున్నారు. మిషన్ కాకతీయ పథకంలో 4 విడతల్లో రూ.312 కోట్లతో 1558 చెరువులను పునరుద్ధరించారు. తద్వారా సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. 2014లో 5.73 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం ఇప్పుడు 8.89 లక్షల ఎకరాలకు చేరింది. ఇక పాలెంలో రూ.29 కోట్లతో వ్యవసాయ డిగ్రీ కళాశాల ప్రారంభంకాగా, కొల్లాపూర్లో ఉద్యాన కళాశాల మంజూరైంది.
ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసింది. ఈ మేరకు జిల్లాకో మెడికల్ కళాశాలను కేటాయించింది. రూ.166 కోట్లతో నాగర్కర్నూల్ జిల్లాలో మెడికల్ కళాశాలకు కొత్త భవనం నిర్మిస్తున్నది. దవాఖానకు అనుబంధంగా 100 పడకలతో ఉన్న ఏరియా దవాఖానను మరో 220 బెడ్లతో ఆధునీకరించి జిల్లా జనరల్ దవాఖానగా మార్చింది. జిల్లాలో 124 పల్లె దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాల మంజూరైంది. అలాగే డయాగ్నొస్టిక్ సెంటర్, క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం, మెంటల్ హెల్త్ క్లినిక్, పాలియేటివ్ కేంద్రం, 102 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 31,538 మందికి కేసీఆర్ కిట్స్ అందాయి. కంటివెలుగులో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 5 లక్షల మందికి పరీక్షలు జరిపి 76 వేల కండ్ల అద్దాలను పంపిణీ చేసింది. ఇటీవలే నల్లమల ప్రజల కోసం అచ్చంపేటలో 100 పడకల దవాఖాన ప్రారంభమైంది. 3 వేల మందికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల్లో ఏప్రిల్లో జిల్లా రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలవడం గమనార్హం.
జిల్లాలో 103 (33/11కేవీ) ఉప కేంద్రాలతో రోజూ 8.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా జరుగుతున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో రూ.74 కోట్లతో 2,126 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, రూ.79 కోట్లతో ఎల్టీ లైన్లు, రూ.36 కోట్లతో 71 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.33.23 కోట్లతో 16,615 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటయ్యాయి. 1,06,822 వ్యవసాయ బావులకు రూ.747 కోట్లతో కనెక్షన్లు ఇవ్వడం గమనార్హం.
దళితబంధు పథకంతో జిల్లాలో 1700 మంది దళితులు ఆర్థిక ప్రయోజనం పొందారు. రాష్ట్రంలోని తొలి నాలుగు పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో ఒకటిగా చారకొండ ఎంపికైంది. ఈ మండలంలో 1,407 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది. మిగిలిన 4 నియోజకవర్గాల్లో 301 మంది లబ్ధిదారులకు పథకం ఫలాలు చేరాయి. దీంతో వ్యవసాయ, రవాణా, దుకాణ సముదాయాలను ప్రారంభించుకొన్న దళితులు వ్యాపారులుగా మారారు.
సమైక్య పాలనలో పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు పథకం తీసుకొచ్చారు. దీంతో యేటా వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇలా జిల్లాలో పది విడతలో 2.88 లక్షల మంది రైతులకు రూ.3,236 కోట్లు ఆర్థిక సాయం అందింది. వివిధ కారణాలతో చనిపోయిన 4,323 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.216 కోట్ల రైతుబీమా సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. ఇక రైతుల కోసం ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదిక చొప్పున జిల్లాలో 143 రైతు వేదికలను రూ.31 కోట్లతో నిర్మించారు. పండిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. గత యాసంగిలో 214 కొనుగోలు కేంద్రాలతో 3,930 మంది రైతుల నుంచి 2.29 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించింది.
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే మిషన్ భగీరథతో జిల్లాలోని 726 ఆవాసాలకు తాగునీరు అందుతున్నది. ఇందుకోసం 2024 కిలోమీటర్ల పైపులైన్ వేశారు. అలాగే 601 సర్వీసు ట్యాంకులను నిర్మించి, లక్షా 92 వేల నల్లా కనెక్షన్లను అందించారు. ఇలా దాదాపు రూ.2 వేల కోట్లతో ప్రతి వ్యక్తికి గ్రామాల్లో రోజుకూ 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్ల నీరు అందుతున్నది.
కొత్త జిల్లా ఆవిర్భవించాక కలెక్టరేట్, పోలీసు భవన సముదాయాలు ఇరుకు భవనాల్లో కొనసాగుతున్నాయి. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ను రూ.52 కోట్లతో, రూ.35 కోట్లతో పోలీసు భవన సముదాయాన్ని నిర్మించారు. కలెక్టరేట్లో హెలీప్యాడ్తో పాటు 32 శాఖల అధికారులు, ఉద్యోగులకు విశాలమైన గదులు ఉన్నాయి. అలాగే వేలాది మంది పోలీసుల వ్యవస్థను పర్యవేక్షించేందుకు సకల సదుపాయాలతో ఎస్పీ కార్యాలయం నిర్మాణమైంది.
అభివృద్ధి ప్రదాత, సీఎం కేసీఆర్ చొరవతోనే ప్రతీ పల్లె, పట్టణం అభివృద్ధి జరుగుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాగా ఏర్పడింది. మెడికల్, అగ్రికల్చర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. నర్సింగ్ కళాశాల మంజూరైంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెండు కళ్లల్లా ముందుకు సాగుతున్నాయి. నేడు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు.
– మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతోపాటు మెడికల్ కళాశాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కొల్లాపూర్ చౌరస్తాకు సమీపంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం కందనూలులో భారీ ఏర్పాట్లు చేపట్టారు. సభా ఏర్పాట్లను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి.. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి సోమవారం పర్యవేక్షించారు. ప్రారంభోత్సవానికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.