జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పార్టీలు, వ్యాపార వర్గాల ప్రజలతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత వెడల్పైన రోడ్లు అభివృద్ధికి నిదర్శనం. సువిశాలమైన రోడ్లు సుందరీకరణకు అస్కారమిస్తాయన్నారు.
సిద్దిపేట తర్వాత అంత విశాలమైన రోడ్లు పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. పాలకుర్తి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. మొదట్లో కొంత ప్రతిఘటన వచ్చినప్పటికి ప్రజలు అన్ని అర్థం చేసుకున్నారు. విగ్రహాలను తొలగించాలని మాకు లేదు. ప్రముఖుల విగ్రహాలు మనకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయి.అయితే, పాలకుర్తి ప్రధాన కూడలిలోని విగ్రహాలను శాశ్వతంగా తొలగించడం లేదు. తాత్కాలికంగా మరోచోటు తరలించామన్నారు. త్వరలోనే వాటిని సముచిత స్థానంలో ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
రాజీవ్ విగ్రహంతో పాటు అదే స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అప్పటివరకు అంతా ఓపిక పట్టాలని సూచించారు. రోడ్ల వెడల్పు సుందరీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలిపారు. వాళ్లకు మంత్రి సమాధానమిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.