మేడ్చల్, మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(CM KCR) కృషి వల్ల తెలంగాణ పల్లెలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మజీద్పూర్, అలియాబాద్ గ్రామాల్లో గురువారం జరిగిన పల్లె ప్రగతి సంబురాలలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సారధ్యంలో పల్లెలు పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
పల్లెలలో సీసీరోడ్లు, సీసీ కెమెరాలు, హరితహారం(Haritha Haram), పల్లె పకృతి వనాలు, డంపింగ్యార్డులు, రైతువేదికలు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, మిషన్ కాకతీయ(Mission Kakatiya) పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపట్టిందన్నారు. అతి తక్కువ వ్యవధిలోనే పల్లెలు అద్భుత ఫలితాలు సాధించాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన పల్లెల ప్రగతిని చూసి వాటిని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు.
పచ్చదనం, పరిశుభ్రంతో పల్లెలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కనుపడుతున్నాయని వివరించారు. స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో పల్లెల ప్రగతి అద్భుతంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుబాయి, జడ్పీటీసీ అనిత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి సంబురాలలో భాగంగా మంత్రి పారిశుధ్య సిబ్బందిని, అధికారులను సన్మానించారు.